టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ డీఆర్ఎస్ విషయంలో కేఎల్ రాహుల్ ఘోర తప్పిదం చేశాడు. రోహిత్ శర్మ రివ్యూ తీసుకోకుండా అడ్డుపడ్డాడు. కానీ రిప్లేలో అది క్లియర్ ఔట్గా తేలింది. దాంతో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. కేఎల్ రాహుల్ తప్పిదంతో డేంజరస్ జోరూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అక్షర్ పటేల్ వేసిన 25వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్రెండో బంతిని జోరూట్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ను మిస్సైన బంతి అతని ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. స్టంప్స్ను మిస్సవుతుందని అంపైర్ అంచనా వేసాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకునేందుకు సిద్దమవ్వగా కేఎల్ రాహుల్ అతన్ని అడ్డుకున్నాడు. కానీ రిప్లేలో బంతి క్లియర్గా వికెట్లను తాకింది. ఈ రిప్లేను చూసి రోహిత్ శర్మ తలపట్టుకున్నాడు. కేఎల్ రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ రివ్యూను టీమిండియా తీసుకొని ఉంటే జోరూట్ 16 పరుగుల వద్దే ఔటయ్యేవాడు. ఈ అవకాశంతో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా తేలిపోయాడు. వికెట్ల వెనుకా బంతులను విడుస్తూ పరుగులిచ్చుకున్నాడు. దాంతో రాహుల్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొందరైతే రాహుల్పై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ దారుణంగా ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు సునాయస క్యాచ్లను నేలపాలు చేశారు. భారత ఆటగాళ్ల తప్పిదాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. హర్షిత్ రాణా రాంగ్ లైన్లో బౌలింగ్ చేయడంతో అతనిపై నోరు పారేసుకున్నాడు. బుర్ర ఉందా? అంటూ మండిపడ్డాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 37 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్తో పాటు జోస్ బట్లర్ ఉన్నారు.