టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన సతీమణి రితికా సజ్దే అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న రోహిత్.. అనేక సందర్భాల్లోనూ రితికాపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. మరోవైపు రితికా సైతం రోహిత్ శర్మ ఆడే మ్యాచ్లకు హాజరై అండగా నిలిచింది. డగౌట్లో చప్పట్లతో అతనికి మద్దతు తెలిపింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వడంతో గత కొంత కాలంగా ఆమె మ్యాచ్లకు హాజరవ్వడం లేదు. అయితే రితికా లేకున్నా.. ఆమెపై ఉన్న ప్రేమను రోహిత్ శర్మ మరోసారి చాటుకున్నాడు.
ఓ బుజ్జి తల్లి..
ఇంగ్లండ్తో ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే ముగిసిన వెంటనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. రోహిత్ శర్మ తన గారాల పట్టీ సమైరాతో మాట్లాడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కొందరైతే పాటలతో ఈ పిక్స్కు క్యాప్షన్స్ ఇస్తున్నారు. 'ఓ బుజ్జి తల్లి.. నా కోసం ఓ మాటైనా మాటాడే!', 'ఓ బుజ్జి తల్లి నీ కోసమే.. ఈ సెంచరీ'అని రోహిత్ శర్మ అంటున్నట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. రోహిత్-రితికాలకు ఇటీవలే కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. అతనికి అహన్ అని పేరు పెట్టుకున్నాడు.

కొడుకు పుట్టిన తర్వాత..
అహన్ పుట్టిన తర్వాత రోహిత్ కెరీర్లో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. కానీ కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు రోహిత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో హిట్ మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ఆటపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ.. కళ్లు చెదిరే షాట్లతో రోహిత్ అలవోకగా సెంచరీ బాదేశాడు. 12 ఫోర్లు, 7 సిక్స్లతో వీరవీహారం చేశాడు. 90 బంతుల్లో 119 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కళాత్మకమైన షాట్లతో..
గత 6 నెలలుగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న రోహిత్.. ఎన్నో అవమానాలు, విమర్శల మధ్య ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. కళాత్మకమైన షాట్లతో తనలో పాత బ్యాటర్ ఇంకా అలాగే ఉన్నాడని హామీ ఇస్తూ అభిమానులను ఉర్రతూలూగించాడు. శుభ్మన్ గిల్తో ఓపెనింగ్ చేసిన రోహిత్ ధనాధన్ బ్యాటింగ్తో మూడొందలపై లక్ష్యాన్ని తేలిక చేసేశాడు. అతనికి అండగా గిల్తో పాటు శ్రేయస్ అయ్యర్ నిలబడగా.. అక్షర్ పటేల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
16 నెలల తర్వాత..
16 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రోహిత్ శర్మ వన్డేల్లో శతకం సాధించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.