మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం బాగుంది. జోరూట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ వన్డే సిరీస్ కోసం ఆతృతగా ఉన్నాం. టీమ్ మోరల్ బాగుంది. ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మా కోచ్ మెక్కల్లమ్ అందర్నీ అలా చూసుకున్నాడు.
మేం టాప్ టీమ్తో వారికి అనుకూలంగా ఉన్న కండిషన్స్లో ఆడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మాకు ఇది కఠినమైన సవాలే. మేం ముగ్గురు పేసర్లతో పాటు ఓ ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో బరిలోకి దిగుతున్నాం.'అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము బౌలింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'ఆరంభంలో కాస్త దూకుడుగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు తగిన సమయం దొరికింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇది మాకు మంచి అవకాశం. కాస్త గేమ్ టైమ్ దొరకడం ముఖ్యం. మాకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాం. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. గత రాత్రి అతనికి మొకాలి నొప్పి వచ్చింది. దాంతో ఈ మ్యాచ్ ఆడటం లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్మెంట్.. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను తీసుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాడు. దాంతో వరుణ్ చక్రవర్తీ బెంచ్కే పరిమితమయ్యాడు. కోహ్లీ గైర్హాజరీతో యశస్వి జైస్వాల్కు తుది జట్టులో చోటు దక్కింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ.
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జోరూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, జాకోబ్ బెతెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్.