టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్ను అధిగమించాడు.
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు నాలుగు ద్వైపాక్షిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్తో పాటు ఇంగ్లండ్పై సిరీస్లను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.

గతంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల నాయకత్వంలో టీమిండియా మూడేసి సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా 4 వేర్వేరు దేశాలపై క్లీన్ స్వీప్ చేసిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్లో 14 ఏళ్లలో అత్యధిక క్లీన్ స్వీప్లను సాధించిన జట్టుగా నిలిచింది. టీమిండియా గత 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ తర్వాత న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్లతో రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీసాడు. రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ(1).. ఈ మ్యాచ్లో మాత్రం రెండో బంతికే ఔటయ్యాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. టామ్ బాంటన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38), గస్ అట్కిన్సన్(19 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.