ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. కటక్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 44), అక్షర్ పటేల్(43 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ(5) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..
భారీ లక్ష్యచేధనకు దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. పవర్ ప్లేలోనే రోహిత్ శర్మ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. తర్వాత శుభ్మన్ గిల్ 45 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. 136 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని జేమీ ఓవర్టన్ విడదీసాడు. శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్తో బౌండరీ కొట్టాడు. కానీ అతన్ని ఆదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు.
రోహిత్ సెంచరీ..
ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్ తరలించి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రోహిత్కు ఇది 32వ శతకం. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్.. లివింగ్ స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అక్షర్ పటేల్తో కలిసి శ్రేయస్ అయ్యర్(44) జట్టును విజయం దిశగా నడిపించాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతను రనౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(10), హార్దిక్ పాండ్యా(10) నిరాశపర్చగా.. రవీంద్ర జడేజా(11 నాటౌట్) సాయంతో అక్షర్ పటేల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.