ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్లో రోహిత్ మరో ఏడు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు.
ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 470 మ్యాచ్ల్లో 593 సిక్సర్లు బాదాడు. ఇందులో టెస్ట్ల్లో 80, వన్డేల్లో 323, టీ20ల్లో 190 సిక్స్లున్నాయి. ఇక ఈ మ్యాచ్లో మరో 23 పరుగులు చేస్తే టెస్ట్ల్లో 4000 పరుగులు మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనతను అదుకున్న 17వ భారత క్రికెటర్గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటి వరకు 57 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రోహిత్ 45.2 సగటుతో 3978 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలతో పాటు 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మరో 13 పరుగులు చేస్తే ఇంగ్లండ్పై టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 16వ భారత బ్యాటర్గా గుర్తింపు పొందుతాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్తో 12 మ్యాచ్లు ఆడి 987 రన్స్ చేశాడు. ఇందులో మూడు శతకాలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్లో ఓడిన రోహిత్ సేన.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు అందుకుంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, ఒలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్ , షోయబ్ బషీర్