టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత 6 నెలలుగా రెడ్ బాల్ క్రికెట్లో దారుణంగా విఫలమైన హిట్ మ్యాన్.. వైట్ బాల్ క్రికెట్లోనూ అదే తడబాటును కొనసాగించాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన హిట్ మ్యాన్ 7 బంతుల్లో 2 పరుగులే చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
సకీబ్ మహ్మూద్ 6వ ఓవర్ రెండో బంతిని ఫుల్లర్ డెలివరీగా వేయగా.. రోహిత్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ముందుగానే షాట్ ఆడటంతో బంతి గాల్లోకి లేచింది. ఈ సునాయస క్యాచ్ను మిడాన్లో ఉన్న లియామ్ లివింగ్ స్టోన్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. దాంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

దారుణంగా విఫలమైన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్కు దిగుతున్నారు. 'మ్యాగీ.. పురుషులు.. రోహిత్ శర్మ 2 నిమిషాలే'అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో సౌత్ హీరోయిన రెజీనా కస్సాండ్ర పురుషుల సెక్స్ సామర్థ్యాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ను ప్రస్తావిస్తూ.. రోహిత్ను ట్రోల్ చేస్తున్నారు.
మ్యాగీ చేసుకునేంత లోపే రోహిత్ ఔటై వస్తాడని సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రోహిత్ పేరు మారుమోగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని నెటిజన్లు సూచిస్తున్నారు. రోహిత్ జట్టుకు భారంగా మారాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.