టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను 4-1తో భారత్ కైవసం చేసుకోవడంతో కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్గా చరిత్రకెక్కాడు.
ధర్మశాల వేదికగా శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సిరీస్ తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం అందుకున్న తర్వాత కూడా ఆ మ్యాచ్లో రోహిత్ సేన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బజ్బాల్ అప్రోచ్పై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇంగ్లండ్ బజ్బాల్ గేమ్ అప్రోచ్కు ధీటుగా బదులిచ్చి సిరీస్ కైవసం చేసుకున్న తొలి సారథిగా కూడా రోహిత్ శర్మ రికార్డు అందుకున్నాడు.
ఇంగ్లండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్గా మెక్ కల్లమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే. బజ్బాల్ గేమ్తో టెస్ట్లకు సరికొత్త ఊపును తీసుకొచ్చిన ఈ ఇంగ్లండ్ ద్వయం.. ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. కానీ టీమిండియా ధాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక సొంతగడ్డపై భారత్కు ఇది 400వ విజయం కావడం మరో విశేషం.
259 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్(128 బంతుల్లో 12 ఫోర్లతో 84) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39) కాపేసు క్రీజులో నిలుచున్నాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అశ్విన్కు అండగా.. జస్ప్రీత్ బుమ్రా(2/38), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 473/8 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 4 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు కోల్పోయి 477 పరుగులకు ఆలౌటైంది. రోహిత్(103), శుభ్మన్ గిల్(110) సెంచరీలతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56), యశస్వి జైస్వాల్(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్(5/173) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.