
న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. జూలై 21 డర్హమ్లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్లో అతను చేరనున్నాడు. దాంతో (మంగళవారం) రేపటి నుంచి ప్రారంభమయ్యే సన్నాహక మ్యాచ్కు అతను దూరం కానున్నాడు.
ఇంగ్లండ్ సిరీస్కు సన్నాహాకంగా బీసీసీఐ డర్హమ్లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20వ తేదీ నుంచి కౌంటీ ఎలెవన్ టీమ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. వార్విక్షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్ పూర్తిగా ఖాళీ స్టేడియంలో జరగనుంది. అయితే జూలై 28న ప్రారంభమయ్యే సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో అతను పాల్గొనే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్ తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వృద్దిమాన్ సాహా ఐసోలేషన్లో ఉన్నాడు. దాంతో ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
ఇంగ్లండ్లో ఇటీవల డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయి రిషభ్ పంత్ కూడా ఈ డెల్టా బారిన పడినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల యూరో చాంపియన్షిప్ మ్యాచ్ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. దాంతో పంత్ వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లిపోయాడు. జూలై 8న పంత్కు కరోనా పాజిటీవ్ వచ్చిందని, 10 రోజుల ఐసోలేషన్ పూర్తవ్వడంతో అతనికి పరీక్షలు జరపగా నెగటీవ్ వచ్చిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఓ డెంటిస్ట్ను కలవడంతోనే పంత్కు వైరస్ అంటుకుందని ప్రచారం కూడా జరిగింది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. దాంతో బయో బబుల్ వీడిన ఆటగాళ్లు 20 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం డర్హమ్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్కు సిద్దమయ్యారు.