
బర్మింగ్హామ్: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. తద్వారా ఇంగ్లండ్ గడ్డపై ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్గా పంత్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులు సాధించాడు. దాంతో 49 ఏళ్ల తర్వాత ఓ వికెట్ కీపర్గా ఇంగ్లండ్ గడ్డపై ఈ ఘనతను అందుకున్నాడు.
పంత్ కన్నా ముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్పై రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా సెంచరీ, హాప్ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్గా పంత్(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఇంగ్లండ్ గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో 200+ స్కోర్ చేసిన తొలి వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. భారత్ తరఫున విరాట్ కోహ్లీ ఒక్కడే ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్లో రెండు సార్లు 200 ప్లస్ రన్స్ చేశాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా విరాట్ కోహ్లీ(149& 51), పంత్ (146& 57) ఈ ఘనతను అందుకున్నారు.
125/3 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా( 17 బ్యాటింగ్)తో పాటు మహమ్మద్ షమీ(13 బ్యాటింగ్) ఉండగా.. భారత్ ఆధిక్యం 361 పరుగులకు చేరింది. ఇక ఓవర్ నైట్ బ్యాటర్ పుజారా(66) తన హాఫ్ సెంచరీని శతకంగా మార్చుకోలేకపోయాడు. బ్రాడ్ బౌలింగ్లో అతను క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అయ్యర్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ ఇంగ్లండ్ కోచ్ మెక్ కల్లమ్ సూపర్ ప్లాన్తో అయ్యర్ను ఔట్ చేసి భారత్ను దెబ్బకొట్టాడు. ఆ కొద్దిసేపటికే పంత్ సైతం లీచ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 207 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.