టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్ను అధిగమించాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 100వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచి 145 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే తనదైన శైలిలో పిల్ల మొగ్గలు వేస్తూ సంబరాలు చేసుకున్నాడు. రిషభ్ పంత్కు ఇది ఏడో టెస్ట్ సెంచరీ. ధోనీ 6 శతకాల రికార్డ్ను పంత్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ల జాబితాలో పంత్, ధోనీ తర్వాత సాహా మూడు శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 6 సెంచరీలు చేస్తే.. పంత్ 44 మ్యాచ్ల్లోనే 7 శతకాలు నమోదు చేశాడు.

ఆసియా బయట ఎక్కువ సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్గా కూడా పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. సిక్సర్తో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డ్ను పంత్ సమం చేశాడు. ఈ ఇద్దరూ మూడు సెంచరీలను సిక్సర్తో పూర్తి చేశారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 6 శతకాలను సిక్సర్తో పూర్తి చేశాడు. అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ నాలుగో స్థానానికి చేరాడు. కుమార సంగక్కర, ఏబీ డివిలియర్స్, మ్యాట్ ప్రియర్, బీజే వాట్లింగ్తో సమంగా నిలిచాడు.
రిషభ్ పంత్ సెంచరీ తర్వాత శుభ్మన్ గిల్ ఔటవ్వడంతో నాలుగో వికెట్కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.ఆ తర్వాత భారత్ పంత్తో సహా వరుసగా వికెట్లు కోల్పోయింది. దాంతో లంచ్ బ్రేక్ సయమానికి భారత్ 454/7 స్కోర్తో నిలిచింది. క్రీజులో జడేజా(2 బ్యాటింగ్) ఉన్నాడు. 25 పరుగుల వ్యవధిలోనే భారత్ 4 వికెట్లు కోల్పోయింది.