టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా రిషభ్ పంత్ నిలిచాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన రెండో వికెట్ కీపర్గా కూడా పంత్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులతో రాణించిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 129 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వార అరుదైన వరల్డ్ రికార్డ్ను సొంతం చేసుకున్నాడు.
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే ఒక మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదు చేశారు. 25 ఏళ్ల క్రితం జింబాబ్వే క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ఈ ఫీట్ సాధించాడు. 2000లో భారత్తో నాగ్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆండీ ఫ్లవర్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులతో అజేయంగా నిలిచిన అతను రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత ఇన్నేళ్లకు రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. రిషభ్ పంత్కు ఇది 8వ టెస్ట్ సెంచరీ. ఇప్పటికే అతను టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డ్ సాధించాడు.

90/2 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బ్రైడన్ కార్స్ బౌలింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్నైట్ స్కోర్కు అతను రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో పంత్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కండిషన్స్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో ఈ జోడీ ఓపికగా ఆడింది. ఈ క్రమంలో రాహుల్ 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 153/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్లో పంత్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
83 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన పంత్ అనంతరం భారీ సిక్సర్లతు బాదాడు. మరోవైపు బషీర్ బౌలింగ్లో క్విక్ డబుల్ తీసి రాహుల్ 202 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సెంచరీకి చేరువైన పంత్.. మూడెంకల మార్క్ అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఒంటి కన్ను సెలెబ్రేషన్స్తో అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
The reactions say it all 💯🔥
— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025
Rishabh Pant becomes he first Indian wicketkeeper to score a century in both innings of a Test match.#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @RishabhPant17 pic.twitter.com/uS99fO5DYc
అనంతరం జోరూట్ వేసిన మరుసటి ఓవర్లో 4, 6, 4 బాదాడు. బషీర్ బౌలింగ్లో పంత్ (118) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుత భారత్ ఆధిక్యం 300 పరుగులు ధాటింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.