ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్కు వెటరన్ బ్యాటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా హాజరుకానున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తమ ఆటగాళ్లు అయిన చతేశ్వర్ పుజారాతో పాటు రవీంద్ర జడేజాలను సన్మానించనుంది.
సౌరాష్ట్ర టీమ్తో పాటు దేశం తరఫున వారు సాధించిన ఘనతలకు గుర్తింపుగా సత్కరించనుంది. జడేజా, పుజారాల సన్మానం గురించి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా మీడియాకు తెలిపారు. 'మేం పుజారా, రవీంద్ర జడేజాలను సన్మానించనున్నాం. స్టేడియానికి కొత్త పేరు పెట్టే కార్యక్రమంలో వారిని సత్కరిస్తాం.'అని జయదేవ్ షా చెప్పారు.

చతేశ్వర్ పుజారా జట్టుకు దూరమై ఏడాదవుతోంది. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో చోటు దక్కుతుందని భావించిన పుజారాకు నిరాశే ఎదురైంది. రంజీ క్రికెట్లో నిలకడగా ఆడినా.. భారత సెలెక్టర్లు పుజారాను పట్టించుకోలేదు. చివరి మూడు టెస్ట్లకు ఎంపిక చేసిన జట్టులో శ్రేయస్ అయ్యర్పై వేటు వేసిన సెలెక్టర్లు.. పుజారాను మాత్రం తీసుకోలేదు.
గాయంతో రెండో టెస్ట్కు దూరమైన రవీంద్ర జడేజా.. చివరి మూడు టెస్ట్లకు ఎంపికయ్యాడు. అయితే అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది.
పుజారాను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. తాను కామెంట్ చేయలేనని చెప్పాడు. 'పుజారా సెలెక్షన్ గురించి నేను మాట్లాడను.
ఎందుకంటే ఇది పూర్తిగా టీమ్మేనేజ్మెంట్, సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం. కానీ అతను జట్టుకు ఎంపికయ్యి ఉంటే మేం మరింత గర్వపడేవాళ్లం. అతను ఇప్పటికే భారత్ తరఫున 100 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. భారత్లో అతి తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పుజారా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 'అని జయదేవ్ షా చెప్పుకొచ్చాడు.