ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సహనం కోల్పోయాడు. ఆఖరి రోజు ఆటలో సహచర ఆటగాడు శార్దూల్ ఠాకూర్ మిస్ ఫీల్డ్ చేయడంతో జడేజా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బంతిని ఆపే క్రమంలో శార్దూల్ ఠాకూర్ జారి పడటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు మూడు పరుగులు తీసారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జడేజా.. గట్టిగా అరుస్తూ శార్దూల్ను బండ బూతులు తిట్టాడు. కింద పడిన తర్వాత త్వరగా లేచి బంతిని ఆపే ప్రయత్నం చేయవచ్చు కదా? అంటూ మందలించాడు.
దానికి శార్దూల్.. జారిపడ్డానని, ఎలా ఆపాలని చెబుతూ బదులిచ్చాడు. రవీంద్ర జడేజా వేసిన 62వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసకుంది. ఈ ఓవర్ మూడో బంతిని స్టోక్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్.. బంతిని ఆపే క్రమంలో కిందపడ్డాడు. దాంతో మూడు పరుగులు వచ్చాయి. కిందపడిన తర్వాత శార్దూల్ ఆలస్యంగా లేచి బంతిని అందించాడు. దాంతో జడేజా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

371 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్లు బెన్ డకెట్(149), జాక్ క్రాలీ(65) అద్భుతమైన భాగస్వామ్యంతో విజయానికి గట్టి పునాది వేసారు. భారత బౌలర్ల వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్ కూడా ఇంగ్లండ్కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది.