ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. రవీంద్ర జడేజా(185 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 101 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగడంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకుంది. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు అజేయంగా 203 పరుగులు జోడించారు. దాంతో 174/2 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 145 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్(238 బంతుల్లో 12 ఫోర్లతో 103) సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(2/67) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ డ్రా అయినా ఈ సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్ట్ ఓవల్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది.

చివరి రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్(230 బంతుల్లో 8 ఫోర్లతో 90) రాత్రి స్కోర్కు మూడు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీకి ఎల్బీగా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ రాగా.. శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడి 228 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా లంచ్ సెషన్కు ముందే శుభ్మన్ గిల్ను జోఫ్రా ఆర్చర్ కీపర్ క్యాచ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి జడేజా రాగా.. అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ జోరూట్ నేలపాలు చేశాడు. దాంతో భారత్ 223/4 స్కోర్ లంచ్ బ్రేక్కు వెళ్లింది.
తొలి సెషన్లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియాకు ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడారు. డ్రా చేయాలనే లక్ష్యంతో క్రీజులో పాతుకుపోయారు. జిడ్డు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించార. ఈ క్రమంలో సుందర్ 117 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జడేజా 86 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. దాంతో టీమిండియా 322/4 స్కోర్తో రెండో సెషన్ను ముగించింది.
ఆఖరి సెషన్లో మరింత స్వేచ్చగా ఆడిన ఈ జోడీ సెంచరీలే లక్ష్యంగా ముందుకు సాగింది. జిడ్డు బ్యాటింగ్తో సహనం కోల్పోయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు డ్రాకు ఒప్పుకోవాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు. కానీ భారత ఆటగాళ్లు అంగీకరించలేదు. బెన్ స్టోక్స్ అయితే తన బలుపు మాటలతో భారత ఆటగాళ్లను రెచ్చగొట్టాడు. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్లో సెంచరీలు చేస్తారా? అని ఎగతాళి చేశాడు. ఈ మాటలను ఏ మాత్రం పట్టించుకోని జడేజా.. డ్రా విషయం తనకు తెలియదని కెప్టెన్ను అడగాలని కోరాడు. హ్యారి బ్రూక్ బౌలింగ్లో సిక్స్ బాదిన జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా.. అతని మరుసటి ఓవర్లో సుందర్ బౌండరీ, క్విక్ డబుల్ సాయంతో టెస్ట్ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే భారత్ డ్రాకు అంగీకరించడంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్మన్ గిల్ 103, జడేజా 107*, సుందర్ 101*, క్రిస్ వోక్స్ 2/67)