వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు విజయానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. జట్టు విజయం కోసం తుది జట్టులో నుంచి తప్పుకోవాల్సి వస్తే మరో ఆలోచన చేయకుండా ఆ పని చేస్తానన్నాడు. టీమిండియాకు సారథ్యం వహించాలనే కోరిక కూడా తనకు లేదని స్పష్టం చేశాడు.
ఇక రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకునేందుకు సిద్దమయ్యాడు. ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లో 100 మ్యాచ్ల మైలురాయి అందుకోనున్నాడు. ఈ ఘనతను అందుకున్న 14వ భారత బ్యాటర్గా చరిత్రకెక్కనున్నాడు.
ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియోసినిమాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో కలిసి అశ్విన్ మాట్లాడాడు.

ఎన్నో కష్టాలు..
కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాను. ప్రతీకూల సమయంలో నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేవాడిని. ఆ కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకే ఈ రోజు నాకంటూ ఈ గుర్తింపు లభించింది. భారత క్రికెట్లో ఈ స్థాయికి చేరుకోగలిగాను.
చాలా మంది నా దగ్గరకు వచ్చి 'నీకు కెప్టెన్గా అవకాశం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.'అని అంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగని విషయమని నాకు తెలుసు. అందుకే మనసులో ఆ ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు. కఠినమైన కొన్ని వాస్తవాలను అంగీకరించాల్సిందే. ఇప్పటికీ బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లను ద్వితీయ శ్రేణి కిందే పరిగణిస్తారు.
నేను సెల్ఫీష్ కాదు..
నేను ఒక్క మ్యాచ్లో విఫలమైతే వెంటనే వేటు వేస్తారు. అదే ఇతర ఆటగాళ్లకు వరుస అవకాశాలు దక్కుతాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. జట్టుకు విజయం దక్కిందా? లేదా? అనేదే ఆలోచిస్తాను. నేను ఆడకున్నా.. జట్టు విజయం సాధిస్తే సంతోషిస్తాను. జట్టు విజయం కోసం తుది జట్టులో నుంచి తప్పుకోమన్నా తప్పుకుంటాను.
అంతేగానీ స్వప్రయోజనాల కోసం జట్టు విజయ అవకాశాలను తాకట్టుపెట్టాలనే స్వార్థం నాకు లేదు. నేను అంత సెల్ఫీష్ కాదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఆ సిరీస్ నాకు ఓ గుణ పాఠం..
2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ తన కెరీర్ టర్నింగ్ పాయింట్గా నిలిచిందని అశ్విన్ తెలిపాడు. '2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అలిస్టర్ కుక్, పీటర్సన్ భారీ స్కోరులు సాధించారు. ఆ సమయంలో జట్టులో నుంచి నన్ను తప్పించాలనే చర్చలు జరిగాయి.
అది నా కెరీర్కు టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. ఆ సిరీస్ వైఫల్యం నాకో గుణపాఠంగా నిలిచింది. నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడానికి కారణమైంది. నా బౌలింగ్ లోపాలు ఏంటో తెలిసాయి. అప్పటి నుంచి నా ఆటను ఎప్పటికిప్పుడూ పరీక్షించుకుంటూ ముందుకు సాగాను'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.