టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహనం కోల్పోయాడు. తన సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ రనౌటయ్యాడు. నాన్స్ట్రైకర్గా ఉన్న రవీంద్ర జడేజాతో సమన్వయ లోపంతో మూల్యం చెల్లించుకున్నాడు.
అయితే క్విక్ సింగిల్ తీసే విషయంలో ముందుగానే కాల్ ఇస్తే రనౌటయ్యేవాడిని కదా? అని అశ్విన్.. జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. జోరూట్ వేసిన 91వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని కవర్స్ దిశగా ఆడిన అశ్విన్.. క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే సింగిల్ కోసం మూవ్మెంట్ ఇచ్చిన జడేజా.. బంతిని ఫీల్డర్ ఆపడంతో యూటర్న్ తీసుకున్నాడు. అప్పటికే అశ్విన్ నాన్స్ట్రైకర్ వైపుకి వచ్చేశాడు. దాంతో ఫీల్డర్ హార్ట్లీ బంతిని అందుకొని వికెట్ కీపర్కు అందజేశాడు. ఫోక్స్ వెంటనే వికెట్లకు కొట్టి అశ్విన్ను రనౌట్ చేశాడు. యూటర్న్ తీసుకునేటప్పుడు కాల్ ఇవ్వచ్చ కదా? అంటూ జడేజాపై అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.
సింగిల్ వద్దని జడేజా చెప్పి ఉంటే అశ్విన్ అప్రమత్తమయ్యేవాడు. అతను అశ్విన్ను చూడకుండా బంతినే చూడటంతో భారత్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అశ్విన్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(35 బ్యాటింగ్)తో జడేజా(155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 81 బ్యాటింగ్) రెండో రోజు ఆటను ముగించాడు.
దాంతో భారత్ 110 ఓవర్లలో 2 వికెట్లకు 421 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 175 పరుగులకు చేరింది. జడేజాతో పాటు యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ, జోరూట్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రేహాన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 246 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.