భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా వెటరన్ క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ సహనం కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్తో గొడవపడ్డాడు. అయితే ఏ విషయం గురించి అశ్విన్ వాగ్వాదానికి దిగాడు అనేదానిపై క్లారిటీ లేదు.
తొలి రోజు ఆటలో చివరి ఓవర్ ఆడిన అశ్విన్.. ఆఖరి బంతి ఆడిన వెంటనే ఫీల్డ్ అంపైర్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఏదో విషయంపై నిలదీస్తూ గట్టిగా మాట్లాడాడు. ఓ వైపు అశ్విన్ గొడవపడుతుంటే మరోవైపు.. సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్ను ఇంగ్లండ్ క్రికెటర్లు అభినందిస్తూ కనిపించారు.

రెహాన్ అహ్మద్ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతిని అశ్విన్ స్వీప్ షాట్ ఆడి ఓవర్ మిడాన్ దిశగా బౌండరీ రాబట్టాడు. ఆఖరి బంతిని స్టెప్ ఔటై డిఫెండ్ చేసిన అతను.. అంపైర్ వద్దకు వచ్చి ఏదో విషయంపై అతన్ని నిలదీసాడు. తొలి రోజు ఆటకు త్వరగా ముగించడాన్ని అశ్విన్ తప్పుబట్టినట్లు అర్థమవుతోంది.
మైదానంలో సహజ వెలుతురు ఉండగానే ఆటను ఆపేయడంపై అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయడంతో వెలుతురు మందగించకుముందే 93 ఓవర్లు పూర్తయ్యాయి. మరో 4-5 ఓవర్ల ఆట సాధ్యమవుతుందని అశ్విన్.. అంపైర్తో వాదించినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 179 బ్యాటింగ్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. శుభ్మన్ గిల్(34), రజత్ పటీదార్(32) పర్వాలేదనిపించారు.
ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.