టెస్ట్ క్రికెట్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..ఈ ఘనతను తన తండ్రికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోజాక్క్రాలీని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు.
అత్యంత వేగంగా 500 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి భారత బౌలర్గా.. రెండో స్పిన్నర్గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ 98 టెస్ట్ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కుంబ్లే 105 టెస్ట్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్గా వేగంగా 500 వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు.
టాప్లో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీథరన్ ఉన్నాడు.

అతడు 87 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో మురళీథరన్ (87), అశ్విన్ (98), అనిల్ కుంబ్లే (105), షేన్ వార్న్ (108), మెక్గ్రాత్ (110) వరుసగా ఉన్నారు. బంతుల పరంగా వేగంగా 500 వికెట్లు సాధించిన రికార్డులో భారత్ తరఫున అగ్రస్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో అశ్విన్ నిలిచాడు.
రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియోసినిమాతో మాట్లాడిన అశ్విన్.. 500 వికెట్ల మైలురాయిని అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాధించిన ఘనత ఇది. ముందుగా ఈ 500 వికెట్ల ఘనతను మా నాన్నకు అంకితం చేస్తున్నాను. ఈ రోజు నేను ఇలా ఆడుతున్నానంటే ఆయనే కారణం. ఎంతో ఎంకరేజ్ చేశారు.
నా ఆటను చూసిన ప్రతీసారి ఎంతో టెన్షన్ పడేవాడు. ఆయనకు గుండెపోటు వచ్చేంత పనయ్యేది. నా వల్లే ఆయన ఆరోగ్యం పాడైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. వన్డే, టీ20 మ్యాచ్ అన్నట్లు దూకుడుగా బ్యాటింగ్ చేసింది. అయితే వారి దూకుడు పట్టించుకోకుండా మేం చేయాల్సిన పనిని చేస్తూనే ఉండాలి. ఈ సిరీస్లో పిచ్లన్నీ తొలి మూడు రోజులు బ్యాటింగ్కు సహకరించాయి.
ఐదో రోజు పిచ్ కఠినంగా మారే అవకాశం ఉంది. మేం క్రమశిక్షణగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో చాలా సార్లు ఇంగ్లండ్ ఇలాంటి పటిష్ట స్థితిలో నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి పట్టు కోల్పోయింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఇరు జట్లకు సమంగా ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే మేం ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.