టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై మండిపడ్డాడు.
192 పరుగుల స్వల్ప లక్ష్య చేధన కోసం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 99/1తో పటిష్టంగా కనిపించి విజయం దిశగా సాగింది. కానీ ఫస్ట్ సెషన్ చివర్లో రోహిత్ శర్మ(55) ఔటవ్వడంతో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ తర్వాత క్రీజులో వచ్చిన రజత్ పటీదార్(0) దారుణంగా విఫలమవ్వగా.. జడేజా(4) ఆచితూచి ఆడాడు. లంచ్ బ్రేక్కు ముందు షోయబ్ బషీర్ వేసిన ఫుల్టాస్కు రవీంద్ర జడేజా చెత్త షాట్తో వెనుదిరిగాడు. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. దాంతో భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక రవీంద్ర జడేజా ఔటైన తీరుపై రవి శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన వికెట్ను జడేజా.. ఇంగ్లండ్కు లంచ్ మెనూలా సమర్పించుకున్నాడని విమర్శించాడు. 'లంచ్ తర్వాత ఇంగ్లండ్కు ఇది డిస్సెర్ట్. ఇంగ్లండ్కు తినే పల్లెం అందించినట్లే'అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, శుభ్మన్ గిల్తో కలిసి జట్టు విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్(122 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్కు రెండు వికెట్లు దక్కగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులే చేసింది. ధ్రువ్ జురెల్(90) అసాధారణ బ్యాటింగ్తో జట్టును ఆదుకోగా.. యశస్వి జైస్వాల్(73) తన ఫామ్ను కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(5/119) ఐదు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ మూడు వికెట్లు పడగొట్టాడు.
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 145 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసాడు.
192 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 61 ఓవర్లలో 5 వికెట్లకు లక్ష్యాన్ని చేధించి సునాయస విజయాన్నందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ తీసారు.