
ఆ విజయాన్ని గుర్తుపెట్టుకొని
కొత్త పుస్తకం 'స్టార్ గేజింగ్' ప్రమోషన్ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ... 'సిరీస్ సాధించడం ఎంతో తేలిక. లార్డ్స్ నుంచి మళ్లీ మొదలు పెట్టాలి. ఆ విజయాన్ని గుర్తుపెట్టుకొని మూడో టెస్టు పరాజయం మర్చిపోవాలి. చెప్పడం కన్నా చేయడం కష్టమని నాకు తెలుసు. కానీ మనం మంచి సందర్భాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఓటములు ఆటలో భాగమే. ఆటకు ముందు సానుకూలంగా ఆలోచించాలి. లార్డ్స్ టెస్టులో భారత్ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఐదో రోజు అద్భుతం చేసింది. నిజానికి రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో భారత్ విజయం లాగేసుకుంది' అని అన్నాడు.

ఆట ఇప్పుడే మొదలైంది
'మూడో టెస్టులో ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. తొలి రోజే మాపై ఆధిపత్యం ప్రదర్శించింది. మమ్మల్ని వెనకడుగు వేసేలా చేసింది. తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌటైనా.. రెండో ఇన్నింగ్స్లో భారత్ బాగానే పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్లో పోరాడాం. కానీ నాలుగో రోజు బంతి బాగా టర్న్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లు కూడా బాగా బంతులు వేశారు.
ఎవరైనా ఈ భారత జట్టును తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. ఈ సిరీసులో ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. ఆట ఇప్పుడే మొదలైంది.. సిరీస్ మేమే గెలుస్తామనే నమ్మకం ఉంది. మా ఆటగాళ్లపై ఆ నమ్మకం ఉంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి
సిరీసు 1-1తో సమమైనా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. 'సొంతగడ్డపై గెలవాలన్న తపన ఇంగ్లండ్కు ఉంటుంది. ఎందుకంటే.. భారత్లో మేమదే చేశాం. బంతి ఇప్పుడు వారి కోర్టులో ఉంది. సిరీస్ కోసం వారు పోరాడరని చెప్పడంలో సందేహం లేదు' అని రవిశాస్త్రి తెలిపాడు. నాలుగో టెస్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఇషాంత్ శర్మ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రానున్నాడు.
ఇక మూడో టెస్టులో గాయపడ్డ రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధించడంతో తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఇక వరుసగా విఫలమవుతున్న అజింక్య రహానేకు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అవకాశం ఇవ్వనున్నాడు.

టీ20 ప్రపంచకప్ లాస్ట్
వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021తో రవిశాస్త్రి కోచ్ పదవి కాలం ముగియనుంది. తన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత జాతీయ జట్టుతో విడిపోవాలని యోచిస్తున్నట్లు కొంతమంది క్రికెట్ బోర్డు సభ్యులకు రవిశాస్త్రి తెలియజేశాడని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. విశ్రాంతి అనంతరం తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడట. ఏదేమైనా మరోసారి రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు సముఖంగా లేడు.

టీమిండియాకు ఎన్నో విజయాలు
2014లో జట్టు డైరెక్టర్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. భారత 2016లో టీ20 ప్రపంచకప్ వరకు అదే పదవిలో కొనసాగాడు. ఆపై అనిల్ కుంబ్లే ఒక సంవత్సరం పాటు కోచ్ పదవి చేపట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగా కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. రవిశాస్త్రి కోచ్ పదవి చేపట్టాడు. రెండు సంవత్సరాలు విజయవంతమవ్వడంతో మరోసారి అతడినే కోచ్ పదవి వరించింది.
రవిశాస్త్రి హెడ్ కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన. ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో కూడా సిరీసులు కైవసం చేసుకుంది. 2019 ప్రపంచకప్లో సెమిస్ చేరింది. పొట్టి ప్రపంచకప్లలో కూడా మంచి ప్రదర్శనే చేసింది. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. రవిశాస్త్రి తన నాలుగేళ్ల పదవి కాలంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.


Click it and Unblock the Notifications

CPL 2021: సూపర్ బౌలింగ్.. 6 పరుగులను కాపాడిన షెఫర్డ్! సూపర్ ఓవర్లో గయానా వారియర్స్ థ్రిల్లింగ్ విక్టరీ!










