కొంచెం అదృష్టం కలిసొచ్చినా లార్డ్స్ టెస్ట్లో టీమిండియా విజయం సాధించేదని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ రనౌటవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారిందన్నాడు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రవి శాస్త్రి.. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ నుంచి ఒక్కరు ఆడినా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. 'కొంచెం లక్ కలిసొస్తే టీమిండియా విజేతగా నిలిచేది. సిరీస్లో 2-1తో ఆధిక్యం సాధించేది. తొలి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ రనౌటవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సమయస్పూర్తితో బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరి రనౌట్ చేశాడు. అప్పటి వరకు టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. ఎప్పుడైతే పంత్ ఔటయ్యాడో అప్పుడే వెనకబడిపోయింది.

కరుణ్ నాయర్ ఏకాగ్రతను కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. తనకు వచ్చిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోతున్నాడు. రెండో ఇన్నింగ్స్లో టాపార్డర్ నుంచి ఒక్కరు ఆడినా ఫలితం మరోలా ఉండేది. బంతి పాతబడిన తర్వాత పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా మారాయి. జడేజా, సిరాజ్, బుమ్రా అద్భుతంగా డిఫెన్స్ చేశారు. నాలుగో రోజు కీలకమైన మూడు వికెట్లు కోల్పోకుండా ఉండి ఉంటే భారత్ విజయం సాధించేది.
ఈ గెలుపు విషయంలో ఇంగ్లండ్ను అభినందించాల్సిందే. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని జయించి గేమ్ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్ను చూస్తుంటే నాకు 2021 టెస్ట్ మ్యాచ్ గుర్తుకొచ్చింది. అప్పుడు భారత్ గెలిస్తే.. ఇప్పుడు ఇంగ్లండ్ విజయం సాధించింది.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత ఆటగాళ్లు.. రెండు రోజుల తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు.