టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరగనున్న ఐదు టెస్ట్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్కు అవకాశం దక్కలేదు. అలాగే వెటరన్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే, హనుమ విహారీలను విస్మరించారు.
అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యూ ఈశ్వరన్లకు మొండి చెయ్యి చూపించారు. ఈ క్రమంలోనే టీమ్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అభిమానులు ద్రవిడ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ పట్ల టీమ్మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు బాలేదని మండిపడుతున్నారు. మానసిక ఒత్తిడితో సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చిన ఇషాన్ కిషన్.. ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో చిల్ అయ్యాడు. ఈ వ్యవహారంపై టీమ్మేనేజ్మెంట్ ఆగ్రహంగా ఉందని ప్రచారం జరిగింది.
ఇషాన్ కిషన్తో పాటు టెస్ట్ల్లో పదే పదే షాట్ పిచ్ బాల్స్కు ఔట్ అవుతున్న శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్కు ఎంపిక చేయలేదని వార్తలు వచ్చాయి. అంతేగాక బీసీసీఐ అనుమతి లేకుండా 'కౌన్ బనేగా కరోడ్పతి' టీవీ షోలో పాల్గొనడటంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారాన్ని రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. ఇందులో వాస్తవం లేదని, ఇషాన్ కిషన్ ఇంకా జట్టుకు అందుబాటులోకి రాలేదని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్కు టీ20ల్లో చోటు లేదని స్పష్టం చేశాడు. ఇంతలోనే ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయగా.. ఇషాన్ కిషన్కు చోటు దక్కలేదు. అతని స్థానంలో యువ ప్లేయర్ ధృవ్ జురెల్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు.
దాంతో ఇషాన్ కిషన్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ, రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్న తీరును అభిమానులు తప్పుబడుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్కు ఒక అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే 'ఇది అన్యాయం ద్రవిడ్ గారూ'అని కామెంట్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్లా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేస్తే ఇలానే జట్టు నుంచి తప్పించేవారా? అని ప్రశ్నిస్తున్నారు.