వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందని, అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని మీడియా ప్రతినిధులకు హితవు పలికాడు.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 106 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ ద్రవిడ్ను మూడో టెస్ట్లో కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అని ప్రశ్నించగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

'కోహ్లీ రీఎంట్రీపై నా కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమం. అతి త్వరలో వారు చివరి మూడు టెస్ట్లకు జట్టును ప్రకటించనున్నారు. కోహ్లీ రీఎంట్రీ గురించి నా కంటే సెలెక్టర్లకే బాగా తెలుసుంటుంది. కోహ్లీతో మేం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే మూడో టెస్ట్ గురించి కోహ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
'ఇప్పటి వరకు అయితే మూడో టెస్ట్కు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పలేదు. కేవలం తొలి రెండు టెస్ట్ల మాత్రమే ఆడనని సమాచారం ఇచ్చాడు. అతను ఏం చెప్పలేదంటే సెలెక్షన్కు అందుబాటులో ఉన్నట్లే. అతి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.'అని సదరు అధికారి వెల్లడించాడు. చివరి మూడు టెస్ట్లకు సంబంధించిన జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెతో గడపాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. బీసీసీఐ అనుమతితో తొలి రెండు టెస్ట్లకు దూరమయ్యాడు. అయితే రెండోసారి తండ్రవుతున్నాననే విషయాన్ని కోహ్లీ గోప్యంగా ఉంచాడు. దాంతో అనేక ఊహాకథనాలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్...అసలు విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దాంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.
ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్ట్లకు ప్రస్తుత జట్టు దాదాపు కొనసాగనుంది. అయితే రెండు టెస్ట్ల్లో విఫలమైన అయ్యర్పై వేటు వేసి సర్ఫరాజ్ ఖాన్ను కొనసాగించవచ్చు. కోహ్లీ రీఎంట్రీ ఇస్తే రజత్ పటీదార్కు ఉద్వాసన పలకనున్నారు. రాహుల్, సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. మూడో టెస్ట్కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.