
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్ టెస్ట్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 11 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ.. సెకండ్ ఇన్నింగ్స్లో 20 పరుగులకే పరిమితమయ్యాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారి(11) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. తనదైన కవర్ డ్రైవ్స్తో జోరు కనబర్చాడు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు మంచి టచ్లో కనిపించాడు. కానీ స్టోక్స్ బౌలింగ్ విరాట్ కోహ్లీ.. జోరూట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జేమ్స్ అండర్సన్.. శుభ్మన్ గిల్(4)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారి కూడా పెద్దగా రాణించలేదు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా నిరాశపర్చడంతో రిషభ్ పంత్(21 బ్యాటింగ్), పుజారా(47 బ్యాటింగ్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 39 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులు చేసిన భారత్.. 245 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇక 84/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులకు కుప్పకూలింది. జానీ బెయిర్ స్టో(140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 106) సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(25) కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించిన బెయిర్ స్టో.. సామ్ బిల్లింగ్స్(36)తో కలిసి ఏడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా బుమ్రా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు, శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు.