
ఓవల్: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ముందు టీమిండియా మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. స్టాండ్బైగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన యువ పేసర్ ప్రసిద్ కృష్ణను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. టీమ్ మేనేజ్మెంట్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే.. నాలుగో టెస్ట్తో ప్రసిద్ కృష్ణ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు నెలలుగా టీమిండియాతోనే ఉంటున్నాడు. స్టాండ్బైగా సేవలు అందిస్తున్నాడు. అతడిని ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. బహుశా నాలుగో టెస్టులోనే అతడితో అరంగేట్రం చేయిస్తారని అనిపిస్తోంది. అలా కుదరకపోతే ఆఖరిదైన మాంచెస్టర్ టెస్టు ఆడటం ఖాయం. సీనియర్ పేసర్ల పనిభారం పర్యవేక్షించేందుకు జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ వరుసగా మూడు టెస్టులు ఆడారు. రొటేషన్ పద్ధతిలో వారికి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉంది. దాంతో ప్రసిద్ధ్ కృష్ణను ప్రధాన జట్టులోకి తీసుకుంటామన్న టీమ్మేనేజ్మెంట్ అభ్యర్థనను సెలెక్షన్ కమిటీ అంగీకరించింది.
'టీమ్ మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో యువ బౌలర్ ప్రసిద్ధ్కృష్ణ ప్రధాన జట్టులో చేరాడు' అని బీసీసీఐ కార్యదర్శి జే షా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా 25 ఏళ్ల ప్రసిద్ధ్ ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచులు ఆడి 34 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్పై టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసి మూడు మ్యాచులు ఆడాడు. మూడు వన్డేల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్ల చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఓవల్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనుంది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు అవకాశం ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా బ్యాట్స్మన్తో బరిలోకి దిగనుంది.