
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా మరో కీలక వికెట్ కోల్పోయింది. 181/6 ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓటమి నుంచి జట్టును గట్టెక్కిస్తాడనుకున్న రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు. బౌండరీతో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. రాబిన్సన్ బౌలింగ్లో బంతిని డిఫెన్స్ చేయబోయి ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా కీపర్ చేతికి చిక్కాడు.
దాంతో భారత్ 194 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మహమ్మద్ షమీ(4 బ్యాటింగ్) రాగా.. ఇషాంత్ శర్మ(12 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరు బౌండరీలు బాదడంతో భారత్ 200 మార్క్ను ధాటగలిగింది. ప్రస్తుతం భారత్ 177 పరుగు ఆధిక్యంలో ఉంది. ఓటమి తప్పించుకోవాలంటే ఫస్ట్ సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయాల్సిందే.
అంతకుముందు ఆతిథ్య జట్టు పేస్-స్పిన్ల కలబోత భారత్ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) 'టాప్' లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
భారత ఓపెనింగ్ జోడీ రాహుల్-రోహిత్ తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మార్క్ వుడ్ పేస్కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్కు వెళ్లారు.
తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్కు 2 పరుగుల రన్రేట్తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు.
ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్కు మళ్లీ ముప్పు తెచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఆలౌట్;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ 87 ఓవర్లలో 204/7