
బర్మింగ్హామ్: టెక్నాలజీ అనేది రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగం కూడా మారుతోంది. వినియోగదారుల అభిరుచులు ఇంకా అలాగే అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.ఇక పెరుగుతోన్న పోటీని తట్టుకుని, వీక్షకులను తమవైపు ఆకర్షించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ స్కై స్పోర్ట్స్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. దీనికి భారత్- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్ట్ను వేదిక చేసుకుంది.
టీఆర్పీలు ఏ మాత్రం పడిపోకుండా.. మ్యాచ్ చూసేవాళ్లకు సరికొత్త అనుభూతినిచ్చేలా అదిరిపోయే ప్రణాళిక రచించింది. ఈ మ్యాచ్ను టీవీ ప్రేక్షకులు మరింత దగ్గర్నుంచి చూసేందుకు గాను.. షాట్ లెగ్లో ఫీల్డింగ్ చేసే ఇంగ్లండ్ ప్లేయర్ హెల్మెట్కు కెమెరాను అమర్చనుంది. దీని కోసం స్కై స్పోర్ట్స్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు( ఈసీబీ) అనుమతి కూడా తీసుకుంది.
ఇక ఇంగ్లండ్ తరఫున షాట్ లెగ్లో ఎక్కువగా ఫీల్డింగ్ చేసేది యువ ప్లేయర్ ఓలీ పోప్ అని గుర్తించిన స్కై స్పోర్ట్స్... అతను ఫీల్డింగ్ చేసే సమయంలో హెల్మెట్కు కెమెరాను అమర్చనుంది. తద్వారా టీవీల ముందు కూర్చుని మ్యాచును తిలకించే అభిమానులు.. 'బ్యాటర్లకు దగ్గరగా..' ఉండి ఆ అనుభూతిని పొందొచ్చు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ కెమెరా.. స్టేడియంలోని ప్రేక్షకుల అరుపులను రికార్డు చేయదు. కేవలం తన ముందు ఉన్న బ్యాటర్ కదలికలు, అతడి ఆటను మాత్రమే దగ్గరగా రికార్డు చేస్తుంది.

స్కై స్పోర్ట్స్ గతేడాది ఇంగ్లాండ్ లో ప్రారంభించిన 'ది హండ్రెడ్ లీగ్' లో ఈ టెక్నిక్ కు ఉపయోగించింది. ది హండ్రెడ్ లీగ్ లో ఫీల్డర్లకు కాకుండా అంపైర్ల క్యాప్స్కు ఈ కెమెరాలు అమర్చారు. కానీ అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లో ఒక ఫీల్డర్ హెల్మెట్కు కెమెరాను అమర్చడం ఇదే తొలిసారి. గతంలో ఐపీఎల్లో ప్లేయర్లకు మైక్లు ఇచ్చి మ్యాచ్ మధ్యలో సంభాషణ సాగించారు. కానీ కెమెరాలు పెట్టడం మాత్రం ఇదే తొలిసారి. మరి భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ మూడో కెమెరా ఎవరికి అమరుస్తారో తెలియాల్సి ఉంది.