ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో విఫలమైన టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని ఆడించవద్దని మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సూచించాడు. రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించాలంటే శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను ఆడించాలని సలహా ఇచ్చాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. బ్యాటింగ్(1, 2), బౌలింగ్లో(0/38, 2/51) దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయవకాశాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ను తప్పించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ బుధవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ ఛానెల్తో మాట్లాడిన సుబ్రమణ్యం బద్రీనాథ్.. టీమిండియా కాంబినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో అర్ష్దీప్ సింగ్ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్ట్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ను తప్పించవచ్చు. అతని స్థానంలో బౌలర్నే తీసుకోవాలి. ప్రసిధ్ కృష్ణను కూడా తప్పించి అర్ష్దీప్ సింగ్ను తీసుకోవాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాలి. అయితే కండిషన్స్ బట్టి ప్లేయింగ్ ఎలెవన్పై తుది నిర్ణయం తీసుకుంటారు.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలని చెప్పాడు. రిస్ట్ స్పిన్ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడలేరని తెలిపాడు. 'కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశాలను టీమిండియా మేనేజ్మెంట్ పరిశీలించాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ రిస్ట్ స్పిన్తో ప్రభావం చూపగలడు. చరిత్ర ప్రకారం రిస్ట్ స్పిన్ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడలేరు.'అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు.