రోహిత్ సెంచరీ సరే..
అయితే ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు కీలక వికెట్లు తీసిన లార్డ్ శార్దూల్ ఠాకూర్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై హాట్ డిబేట్ నడుస్తోంది. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సాధించిన శతకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓటమి ఖాయమనుకున్న దశలో భారత్ను మళ్లీ పోటీలోకి తెచ్చింది అతని ఇన్నింగ్సే.
లార్డ్ శార్దూల్..
అయితే ఈ మ్యాచ్లో అతన్ని మించిన హీరో మాత్రం శార్దూల్ ఠాకూరే. గత టెస్టులో మాదిరే కుప్పకూలేలా కనిపించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 200కు చేరువైంది శార్దూల్ అర్ధశతకం వల్లే. రెండో ఇన్నింగ్స్లో పంత్తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు పరిచింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో బర్న్స్ను ఔట్ చేసి తొలి వికెట్ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించింది శార్దూలే.
ఇంగ్లండ్ బ్యాటింగ్లో అత్యంత కీలకమైన రూట్ వికెట్ను పడగొట్టిందీ అతనే. భారత్ విజయం ఖరారైంది ఆ వికెట్తోనే. అందుకే శార్దూల్కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కాల్సిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిసున్నాయి.

శార్దూల్.. ఇండియా లార్డ్..
ఫస్ట్ ఇన్నింగ్స్లో 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా జట్టులోకి వచ్చిన శార్దూల్.. ధనాధన్ బ్యాటింగ్తో మెరుపులు మెరిపించాడు. ప్రధాన బ్యాట్స్మన్ అంతా తడబడిన చోట స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో ఎదురుకుదాడికి దిగాడు. ఆ క్రమంలో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకొని ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్మన్ గుర్తింపుపొందాడు. శార్దూల్ హాఫ్ సెంచరీతో 8వ వికెట్కు కీలక 63 పరుగులు జతయ్యాయి.
అతను ఔటైన వెంటనే ఒక పరుగు వ్యవధిలోనే భారత్ ఆలౌటైందంటే అతను ఎంత కీలక ఇన్నింగ్స్ ఆడాడో తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో సైతం రిషభ్ పంత్తో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్లో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.

రోహిత్ సెంచరీ చేయకుంటే..
ఈ క్రమంలోనే విజయానికి కావాల్సిన పెర్ఫామెన్స్ చేసిన శార్దూల్ ఠాకూర్కు మ్యన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్ శర్మ సెంచరీ చేయకుంటే శార్దూల్ ఆడినా ఫలితం ఉండకపోయేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మ్యాచ్ మలుపుతిప్పిందే రోహిత్ శర్మని, అతను గనుక విఫలమయ్యుంటే.. భారత ఇన్నింగ్స్ కుప్పకూలేదని కామెంట్ చేస్తున్నారు.
అప్పుడు ఇంగ్లండ్ ముందు స్వల్ప లక్ష్యం ఉండేదంటున్నారు. శార్దూల్ గొప్పగా ఆడాడని కాదంటలేమని, కానీ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు అర్హుడని కామెంట్ చేస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్కు ఇవ్వాల్సిందని చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications












