
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే వర్షం ప్రారంభమవడంతో టాస్కు ఆలస్యమైంది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో అంపైర్లు టాస్ తతంగాన్ని పూర్తి చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకోగా.. ఇంగ్లండ్ టీమ్లో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి రాగా.. వరుసగా విఫలమవుతున్న జాక్ క్రాలీ, డేనియల్ లారెన్స్ స్థానంలో హసీబ్ హమీద్, మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చారు. గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయిన సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బదులు మార్క్ వుడ్ బరిలోకి దిగాడు.
ఇక ఆటగాళ్లు మైదానంలోకి దిగి మొదలుపెడదామనే సరికే వర్షం మళ్లీ మొదలైంది. దాంతో అంపైర్లు ఆటను నిలిపేసి మైదానాన్ని కవర్లతో కప్పేసారు. మళ్లీ బ్రేక్ ఇవ్వడంతో మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే వర్షం కారణంగా అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్లో ఎవడ్రా మ్యాచ్లు పెట్టమన్నదని మండిపడుతున్నారు. అసలు భారత్తో మ్యాచ్ అంటేనే వర్షం పడుతుందా? లేక వర్షం పడేటప్పుడు భారత్కు మ్యాచ్లు పెడతారా? అని ఓ అభిమాని సెటైరిక్ మీమ్ ట్వీట్ చేశాడు. కాలంతో సంబంధం లేకుండా వాతావరణ ఉండే ఇంగ్లండ్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం నిషేధించాలని మరో అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.
వరుణుడి అంతరాయంతో నాటింగ్హామ్ టెస్టులో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీసేన.. మలి టెస్టులో ఇంగ్లండ్పై పంజా విసరాలని చూస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటేందుకు భారత్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. అయితే బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను వేధిస్తున్నది. టాపార్డర్లో కేఎల్ రాహుల్ ఫామ్లోకి రాగా మిడిలార్డర్ సమయోచిత పాత్ర పోషించడం లేదు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం లేదు. సీనియర్లు అయిన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ బ్యాట్లు ఝులిపించడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే లోయర్ ఆర్డర్లో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించే సత్తా ఉన్న శార్దుల్కు గాయం కావడం తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపింది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.