ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో టీమిండియా ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయం టీమిండియాకు నష్టం చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. దాంతో పేసర్లు అదనపు భారాన్ని మోయలేకపోయారు. ఆకాష్ దీప్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్ చేశాడు. సిరాజ్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. నాలుగో రోజు ఆట అనంతరం ఈ విమర్శలకు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సమాధానమిచ్చాడు. ఎక్స్ట్రా బ్యాటర్ కోసమే ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగామని స్పష్టం చేశాడు.
'ప్రతీ మ్యాచ్కు ముందు తుది జట్టు ఎంపికపై చర్చ జరుగుతుంది. పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసి ఫైనల్ ఎలెవన్పై నిర్ణయం తీసుకుంటాం. ఆట సాగుతున్నా కొద్దీ పిచ్ రోజు రోజుకూ మారిపోతూనే ఉంటుంది. బౌలింగ్లో కంటే ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటే బాగుంటుందని అనిపించింది. గత మ్యాచ్ల్లోనూ నాలుగో పేసర్ మరీ ఎక్కువ ఓవర్లు వేసిన సందర్భాలు లేవు. జడేజా, సుందర్ లాంగ్ స్పెల్స్ వేయగలరు. అందుకే నాలుగో పేసర్తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ను తీసుకోకుండా ఎక్స్ట్రా బ్యాటర్ను తీసుకున్నాం. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే తీసుకుంటాం.'అని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

50/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. మ్యాచ్ ఆగిపోయే సమయానికి 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 111), జోరూట్(152 బంతుల్లో 12 ఫోర్లతో 105) శతకాలతో సత్తా చాటగా... బెన్ డకెట్( 83 బంతుల్లో 6 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో జెమీ ఓవర్టన్(0 బ్యాటింగ్), జెమీ స్మిత్(2 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్కు నాలుగు వికెట్లు కావాలి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.