ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఆఖరి రోజు ఆటలోనూ భారత ఫీల్డర్లు కీలక క్యాచ్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్ డకట్ ఇచ్చిన క్యాచ్ను యశస్వి జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో బౌలర్ మహమ్మద్ సిరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అసహనంతో జైస్వాల్పై నోరు పారేసుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఐదో రోజు ఆట రెండో సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన 39వ ఓవర్ ఐదో బంతిని బెన్ డకెట్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ దగ్గర నుంచి పరుగెత్తుకొచ్చిన జైస్వాల్ క్యాచ్ కోసం డైవ్ చేశాడు. కానీ బంతిని అందుకోలేకపోయాడు. దాంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురవ్వగా.. డ్రెస్సింగ్ రూమ్లోని గంభీర్ కూడా కోపంగా కనిపించాడు. ఈ అవకాశంతో చెలరేగిన డకెట్.. జడేజా వేసిన మరుసటి ఓవర్లో బౌండరీ బాది 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్యాచ్ డ్రాప్తో యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్ను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఓ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు వదిలేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ మూడు ఈజీ క్యాచ్లు నేలపాలు చేశాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ మొత్తం 4 క్యాచ్లు చేజార్చాడు.

ఐదో రోజు ఆట ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ను పంత్ అందుకోలేకపోయాడు. మరోసారి రిటర్న్ క్యాచ్ ఇవ్వగా బుమ్రా వదిలేసాడు. మొత్తం మూడు లైఫ్స్తో డకెట్ సెంచరీ సాధించాడు.371 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. విజయం దిశగా సాగుతోంది. 46 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. భారత్ విజయానికి 8 వికెట్లు కావాల్సి ఉండగా.. ఇంగ్లండ్కు 158 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నమోదైంది.