
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/66) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దాంతో 84/5 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ 284 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను ముగించింది. దాంతో భారత్కు 136 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జానీ బెయిర్ స్టో(140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 106) సెంచరీతో ఆదుకున్నాడు.
కెప్టెన్ బెన్ స్టోక్స్(25) కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించిన బెయిర్ స్టో.. సామ్ బిల్లింగ్స్(36)తో కలిసి ఏడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా బుమ్రా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు, శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు.
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్కు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ శుభారంభం అందించారు. స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అయినా అతను ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్ క్రీజులోకి రాగా.. బెయిర్ స్టో ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన బెయిర్ స్టో.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఫోర్ బాది 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన బెయిర్స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడాదిలో జానీ బెయిర్స్టోకి ఇది ఐదో సెంచరీ కాగా.. వరుసగా మూడోది. ఇక సూపర్ డెలివరీతో బెయిర్ స్టోను షమీ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. క్రీజులో సెట్ అయిన సామ్ బిల్లింగ్స్ను సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన స్టువర్ట్ బ్రాడ్(1), మాథ్యూ పోట్స్లను కూడా అతనే పెవిలియన్ చేర్చాడు.