ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ సిరాజ్.. ఫీల్డింగ్లో ఘోర తప్పిదం చేశాడు. దాంతో ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను అద్భుతంగా అందుకున్న సిరాజ్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. బౌండరీ లైన్కి దగ్గరగా ఉన్నాననే విషయాన్ని మరిచి ఈ ఘోర తప్పిదం చేశాడు. దాంతో వికెట్ కావాల్సిన బంతి సిక్సర్గా మారింది.
నాలుగో రోజు ఆట తొలి సెషన్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 35వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా బౌండరీ లైన్కు దగ్గరగా ఉన్నానే విషయం మరిచిపోయాడు. బౌండరీ లైన్ తొక్కగానే షాక్కు గురైన సిరాజ్.. తలను పట్టుకున్నాడు. మరోవైపు సిరాజ్ క్యాచ్ పట్టడంతో సంబరాలు చేసుకున్న ప్రసిధ్.. చివరకు అసలు విషయం తెలుసుకొని తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ అవకాశంతో హ్యారీ బ్రూక్ చెలరేగుతున్నాడు.

374 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 50/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ డకెట్(54)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. కెప్టెన్ ఓలీ పోప్(27)ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జోరూట్(23 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్(38 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు ఇప్పటికే 58 పరుగులు అజేయంగా జోడించారు. దాంతో ఇంగ్లండ్ 164/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 210 పరుగులు అవసరం కాగా.. భారత్కు 6 వికెట్లు కావాలి. భుజ గాయంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ చేయలేని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(118) సెంచరీతో సత్తా చాటగా.. ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు.