ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆటలో సిరాజ్ సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. బుల్లెట్ లాంటి యార్కర్లతో ఇంగ్లండ్ బ్యాటర్ల స్టంప్స్ను ఎగరగొట్టాడు. దాంతో ఇంగ్లండ్ 20 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.
ముఖ్యంగా సిరాజ్ వేసిన స్టన్నింగ్ యార్కర్లకు ఇంగ్లండ్ టేయిలెండర్స్ రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1) బిత్తరపోయారు. రెహాన్ అహ్మద్ అయితే తాను ఎలా ఔటయ్యాననేది అర్థం కాక అయోమయంతో మైదానం వీడాడు. సిరాజ్ వేసిన 70వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని సిరాజ్ యార్కర్గా సంధించగా.. రెహాన్ అహ్మద్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు.

కానీ సిరాజ్ వేగానికి బ్యాట్ కింది భాగంలో తాకిన బంతి ఆఫ్ స్టంప్ను తాకింది. బంతి తన బ్యాట్ను ఎలా మిస్సయ్యిందనేది రెహాన్ అహ్మద్కు అంతు చిక్కలేదు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి ఇదే తరహా యార్కర్తో అండర్సన్(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
సిరాజ్ సంచలన ప్రదర్శనపై నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రవి శాస్త్రి, మహ్మద్ కైఫ్ సిరాజ్ బౌలింగ్ను మెచ్చుకున్నారు. సీనియర్ బౌలర్ గైర్హాజరీలో సిరాజ్ సత్తా చాటాడని కొనియాడాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడని, అతను ఎంతో ప్రతిభ కలిగిన బౌలర్ అని రవి శాస్త్రి కొనియడాడు.
207/2తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్కు 126 పరుగుల ఆధిక్యం లభించింది. మహమ్మద్ సిరాజ్ ధాటికి 20 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో సిరాజ్కు నాలుగు వికెట్లు, జడేజా, కుల్దీప్కు రెండేసి వికెట్లు దక్కాయి. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీసారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.