ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్(6/70) నిప్పులు చెరిగాడు. దాంతో 77/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు కుప్పకూలింది. జెమీ స్మిత్(207 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్స్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్(234 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్తో 158) భారీ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరే 6వ వికెట్కు 303 పరుగులు జోడించారు.
భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్ దీప్(4/88) నాలుగు వికెట్లు పడగొట్టారు. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. దాంతో టీమిండియాకు 180 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

మూడో రోజు ఆట ఆరంభంలోనే సిరాజ్.. టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. వరుస బంతుల్లో జో రూట్(22), బెన్ స్టోక్స్(0)లను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు లేదు. హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ అద్భుత బ్యాటింగ్తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వన్డే తరహా బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేశారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ షార్ట్ పిచ్ డెలివరీలను చీల్చి చెండాడారు. దాంతో మూమెంటమ్ మొత్తం ఇంగ్లండ్ వైపు మళ్లింది. లంచ్ సెషన్కు ముందు జడేజా ఓవర్లో రెండు బౌండరీలు బాది జెమీ స్మిత్ 80 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 249/5 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. తొలి సెషన్లో ఇంగ్లండ్ 27 ఓవర్లలో 172 పరుగులు చేసింది.
రెండో సెషన్ ఆరంభంలోనే హ్యారీ బ్రూక్ 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జెమీ స్మిత్ తన జోరును కొనసాగించాడు. ఈ ఇద్దరు ఇచ్చిన కష్టతరమైన క్యాచ్లను భారత ఆటగాళ్లు వదిలేసారు. దాంతో చెలరేగిన ఈ జోడీ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచింది. జెమీ స్మిత్ 144 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 355/5 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్లో ఇంగ్లండ్ 28 ఓవర్లలో 106 పరుగులు చేసింది.
ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ దూకుడు కనబర్చింది. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుకున్న భారత పేసర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగారు. హ్యారీ బ్రూక్ను క్లీన్ బౌల్డ్ చేసి ఆకాశ్దీప్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 303 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం సిరాజ్.. బ్రైడన్ కార్స్(0), జోష్ టంగ్(0)లను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన సిరాజ్.. షోయబ్ బషీర్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు. బుమ్రా లేని లోటు సిరాజ్ తన అద్భుత ప్రదర్శనతో తీర్చాడు.