సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న షమీ.. సౌతాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లలేదు.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కైనా అతను అందుబాటులోకి వస్తాడని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. చీలమండ గాయం నుంచి మహమ్మద్ షమీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దాంతో ఇంగ్లండ్తో జరిగే తొలి రెండు టెస్ట్లకు అతను దూరంగా ఉండననున్నాడని ఎన్సీఏ వర్గాలు పేర్కొన్నాయి.
మహమ్మద్ షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్నెస్ టెస్ట్లో నెగ్గాల్సి ఉందని ఎన్సీఏ అధికారులు తెలిపారు.

'మహమ్మద్ షమీ ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించలేదు. ఎన్సీఏకు వెళ్లి ఫిట్నెస్ట్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. దాంతో అతను ఇంగ్లండ్తో తొలి టెస్ట్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.'అని ఓ అధికారి అన్నాడు.
గాయంతోనే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన షమీ.. ప్రతీ రోజూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ సాయంతో మ్యాచ్ ఆడాడు. పంటి బిగువన నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. సౌతాఫ్రికా పర్యటనలో మహమ్మద్ షమీ లేకపోవడంతో టీమిండియా ఇబ్బంది పడింది. మూడో పేసర్గా ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సొంతగడ్డపై జరగనున్న నేపథ్యంలో మహమ్మద్ షమీ విషయంలో బీసీసీఐ తొందరపడటం లేదు. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా రూపంలో ఇద్దరు స్టార్ పేసర్లు ఉండటం.. టర్నింగ్ ట్రాక్పై ఆడే అవకాశం ఉండటంతో షమీ పూర్తిగా కోలుకునే వరకు సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరగనుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్ట్ల సిరీస్ షెడ్యూల్..
తొలి టెస్ట్: జనవరి 25-29, హైదరాబాద్
రెండో టెస్ట్: ఫిబ్రవరి 2-06, విశాఖపట్నం
మూడో టెస్ట్: ఫిబ్రవరి 15-19, రాజ్కోట్
నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 23-27, రాంచీ
ఐదో టెస్ట్: మార్చి 07-11, ధర్మశాల