టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని అరుదైన ఘనత ఊరిస్తోంది. గాయంతో గత 15 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న షమీ.. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో(బుధవారం) ప్రారంభమయ్యే తొలి మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ మ్యాచ్లో షమీ 2 వికెట్లు పడగొడితే అంతర్జాతీయ క్రికెట్లో 450 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో పేసర్ కపిల్ దేవ్ సరసన షమీ నిలవనున్నాడు.
ఈ జాబితాలో కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597), జవగల్ శ్రీనాథ్(551) మహమ్మద్ షమీ కన్నా ముందున్నారు. ఓవరాల్గా అనిల్ కుంబ్లే 401 మ్యాచ్ల్లో 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 287 మ్యాచ్ల్లో 765 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

హర్భజన్ సింగ్ 365 మ్యాచ్ల్లో 707 వికెట్లు, కపిల్ దేవ్ 356 మ్యాచ్ల్లో 687 వికెట్లు, రవీంద్ర జడేజా 351 మ్యాచ్ల్లో 597 వికెట్లు, జహీర్ ఖాన్ 351 మ్యాచ్ల్లో 597 వికెట్లతో, జవగళ్ శ్రీనాథ్ 296 మ్యాచ్ల్లో 551 వికెట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మహమ్మద్ షమీ 4.12 ఎకానమీతో 448 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో రెండు వికెట్లు తీస్తే షమీ 450 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు.
చీలమండ, మొకాలి గాయాలతో షమీ గత 15 నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా అతను టీమిండియా తరఫున ఆడాడు.
గాయం నుంచి కోలుకోవడానికి చాలా కష్టపడ్డానని షమీ తెలిపాడు. "బౌలింగ్ చేయడం, కారు డ్రైవింగ్ చేయడం లేదా గాలి పటం ఎగరేయడం.. ఏదైనా సరే చేయాలంటే ముందు మానసికంగా బలంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం ఏ పైనా చేయగలం. పరుగులు చేస్తూ, వికెట్లు తీసే సమయంలో ప్రతిఒక్కరూ మన చుట్టే ఉంటారు. కానీ అసలైన పరీక్ష అది కాదు. కష్ట సమయాల్లో మనతో ఎవరు ఉంటారనేది తెలుసుకోగలగాలి. దాదాపు ఏడాది కాలం పాటు నేను అదే చూశా. చాలా కష్టపడ్డాను. భయంగానే పరిగెత్తాను. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేశాను. కఠినంగా శ్రమిస్తేనే.. ఫలితాలు గొప్పగా ఉంటాయి." అని షమీ అన్నాడు.