
టీమిండియా ఓవల్ టెస్టు నెగ్గితే
ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్కు హిందీ కామెంటేటర్గా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యవహరించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కైఫ్ మాట్లాడుతూ.. టీమిండియా ఓవల్ టెస్టు నెగ్గితే తాను కచ్చితంగా నాగిని డ్యాన్స్ వేస్తానంటూ చెప్పుకొచ్చాడు. నిజామా అని సహచరులు అడగ్గా.. కావాలంటే మ్యాచ్ అయ్యాక చూడండి అని సమాధానం ఇచ్చాడు. 368 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఐదవ రోజు 210 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇచ్చిన మాట ప్రకారం
మహ్మద్ కైఫ్ తాను ఇచ్చిన మాట ప్రకారం నాగిని డ్యాన్స్ నేర్చుకొని మరి కొన్ని స్టెప్పులు వేశాడు. దానికి సంబంధించిన గ్లింప్స్ను కైఫ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. 'టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు' అంటూ కైఫ్ క్యాప్షన్ను జోడించాడు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
IND vs ENG: 'నాలుగు రోజులు ఆడిన ఘనత టీమిండియాకే దక్కుతుంది.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ సూపర్'

క్వారంటైన్లో కైఫ్
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండోదశ కోసం మహ్మద్ కైఫ్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏర్పాటు చేసిన క్యాంప్లో మంగళవారం చేరాడు. మరికొన్ని రోజుల పాటు దుబాయ్ హోటల్ క్వారంటైన్లో గడపనున్నాడు కైఫ్. అనంతరం ఢిల్లీ ఆటగాళ్ల ఆటను పరిశీలించనున్నాడు.
కైఫ్ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 624, వన్డేల్లో 2753 రన్స్ చేశాడు. కైఫ్ అద్భుత ఫీల్డర్గా పేరుగాంచాడు. 2000 నుంచి 2006 వరకే కైఫ్ భారత జట్టుకు ఆడాడు. 2008 నుంచి 12 వరకు ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. ఆపై కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోచింగ్ బృందంలో కూడా పనిచేస్తున్నాడు.

157 పరుగుల తేడాతో
ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో టీమిండయా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్లో 368 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ (3), ఠాకూర్ (2), బుమ్రా (2), జడేజా (2) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ శతకం (127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది.


Click it and Unblock the Notifications












