టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్కు ఈ యువ ఓపెనర్ నుంచే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా యశస్వి జైస్వాల్తో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.
'ప్రస్తుత టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్తోనే ఇంగ్లండ్కు ప్రమాదం పొంచి ఉంది. అతన్ని ఎంత త్వరగా కట్టడి చేయగలిగితే ఇంగ్లండ్కు అంత మేలు జరుగుతోంది. యశస్వి జైస్వాల్ అసాధారణ బ్యాటర్. అతన్ని నేను ముంబైలో కలిసిన మరుసటి రోజే శతకం బాదాడు. వరల్డ్ బెస్ట్ క్రికెట్ టీమ్పై డబుల్ సెంచరీ సాధించాడు. స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

యశస్విని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ ప్రత్యేకమైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి. లేకుంటే అతను ఒంటి చేత్తో భారత్ను గెలిపిస్తాడు.'అని ఇంగ్లండ్కు మైకేల్ వాన్ సూచించాడు.
గతేడాది వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్.. తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వైజాగ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్ల్లో డబుల్ సెంచరీ బాదిన అతిపిన్న భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో యశస్వి 80 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 80 యావరేజ్తో 321 రన్స్ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్లు జరగ్గా చెరొక మ్యాచ్ గెలిచాయి. దాంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్కు ముందు 10 రోజుల విశ్రాంతి లభించడంతో భారత ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోగా.. ఇంగ్లండ్ యూఏఈ వెళ్లి ప్రిపేర్ అవుతోంది. మరో రెండు రోజుల్లో ఇరు జట్లు మ్యాచ్ వేదికైన రాజ్కోట్కు రానున్నాయి.