ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆఖరి టెస్ట్ ఆడి ఉంటే టీమిండియా గెలిచేది కాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. క్లిష్ట స్థితిలో జట్టును ఎలా నడిపించాలో.. మరెలా బ్యాటింగ్ చేయాలో అతనికి బాగా తెలుసన్నాడు. బెన్ స్టోక్స్ గాయం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మైఖేల్ వాన్.. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ భయంతోనే ఓటమిపాలైందన్నాడు. 'ఆఖరి రోజు ఆట ఉదయం బెన్ స్టోక్స్ ఉండి ఉంటే.. ఇంగ్లండ్ సునాయసంగా గెలిచేది. ఇంగ్లండ్ మానసిక స్థితిలో అతను కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఇంగ్లండ్ తమ శైలికి భిన్నంగా భయపడుతూ ఆడింది. వారి విజయానికి ఒక చిన్న భాగస్వామ్యమే అవసరం. కానీ వారు భయపడుతూ దూకుడుగా ఆడటం వల్ల ఓటమి పాలయ్యారు.'అని మైఖేల్ వాన్ తెలిపాడు.
బాజ్ బాల్ విప్లవాన్ని తీసుకొచ్చిన బెన్ స్టోక్స్.. అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును నడిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆల్రౌండ్ ప్రదర్శనలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆఖరి టెస్ట్కు భుజ గాయంతో బెన్ స్టోక్స్ దూరంగా ఉండగా.. అతని లోటు ఇంగ్లండ్లో స్పష్టంగా కనిపించింది. తాత్కలిక కెప్టెన్ ఓలీ పోప్ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.