ఐదు టెస్ట్లో సిరీస్లో భాగంగా భారత్తో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. టెక్నాలజీ తప్పిదం కారణంగా తమ బ్యాటర్ ఓలి పోప్ ఔటయ్యాడని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, మైకేల్ వాన్ ఆరోపించారు. డీఆర్ఎస్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 30వ ఓవర్లో ఓలీ పోప్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ ఓవర్ చివరి బంతిని సిరాజ్ ఇన్స్వింగర్గా వేయగా.. ఓలీపోప్ బీట్ అయ్యాడు. బ్యాట్ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌటిచ్చాడు. ఔట్సైడ్ లెగ్ స్టంప్ దిశగా దూసుకెళ్తుందని అతను భావించాడు.

అయితే ఔటని భావించిన సిరాజ్ మాత్రం రివ్యూ కోసం పట్టుబట్టాడు. సిరాజ్ కోరిక మేరకు రోహిత్ సైతం రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్ రిప్లేలో బంతి లెగ్ స్టంప్ను తాకుతున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. ఓలి పోప్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఓలి పోప్ ప్యాడ్లను బంతి హైట్లో తాకితే.. బాల్ ట్రాకింగ్లో మాత్రం వికెట్ స్టంప్స్ను తాకుతున్నట్లు చూపించారని మైకేల్ వాన్, స్టువర్ట్ బ్రాడ్ ఆరోపిస్తున్నారు.
ఈ వికెట్కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన స్టువర్ట్ బ్రాడ్.. బంతి ఎత్తులో తాకిందని, కానీ 3 రెడ్స్ వచ్చాయని పేర్కొన్నాడు. మైకేల్ వాన్ సైతం బంతి ఎత్తులో తాకిందని కామెంట్ చేశాడు.
అయితే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల ఆరోపణలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. ఎప్పుడు ఏదో ఆరోపణ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తారని విమర్శిస్తున్నారు. ఇక డీఆర్ఎస్ను తప్పుబట్టడం ఇంగ్లండ్కు ఇదే తొలిసారి కాదు. వైజాగ్ టెస్ట్లోనూ జాక్ క్రాలీ వికెట్ విషయంలో బెన్ స్టోక్స్ ఇదే తరహా ఆరోపణలు చేశాడు.
ఈ మ్యాచ్లో బెన్ డక్కెట్(118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లతో 133 నాటౌట్) విధ్వంసకర శతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.