ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్- సచిన్ ట్రోఫీలో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ సూచించాడు. కుల్దీప్ యాదవ్ టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడని చెప్పాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుది జట్టు గురించి మాట్లాడిన మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్తో అద్భుత ప్రదర్శన కనబర్చారు. రెండో ఇన్నింగ్స్లో చెరో వికెట్ పడగొట్టారు. అయితే కుల్దీప్ యాదవ్ లేకుండా టీమిండియాకు 20 వికెట్ల పడగొట్టే సామర్థ్యం ఉందా? కుల్దీప్ యాదవ్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడనుకుంటున్నా. అతను తుది జట్టులోకి వస్తే ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడనేది నా అంచనా. రెండో టెస్ట్లోనే అతనికి అవకాశం దక్కుతుందని భావించా.'అని మైఖేల్ క్లార్క్ తెలిపాడు.

పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ ఏం చేస్తుందో ఆసక్తికరంగా ఉందని క్లార్క్ తెలిపాడు. 'నితీష్ కుమార్ రెడ్డి ఏం చేస్తారో? అతన్ని కొనసాగిస్తారా? పక్కనబెడుతారా? చాలా ఆసక్తికంగా ఉంది. రెండో టెస్ట్లో అతను అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై అతని సత్తా ఏంటో మనమంతా చూశాం.
అతను జట్టుకు కావాల్సిన పరుగులు చేయడంతో పాటు కావాల్సిన ఓవర్లు బౌలింగ్ చేయగలడు. కానీ ప్రస్తుతం టీమ్మేనేజ్మెంట్ అతని గురించి సమాలోచనలు చేస్తుంది. బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు కాబట్టి బౌలింగ్ విభాగంలో ప్రసిధ్ కృష్ణపై వేటు పడవచ్చు. బుమ్రా కోసం అతన్ని తుది జట్టు నుంచి తప్పించవచ్చు.'అని మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు.