IND vs ENG: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో స్టన్నింగ్ డెలివరీతో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(10)ను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ యాదవ్ స్నేక్ బాల్కు బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనూహ్యంగా టర్న్ అయిన బంతిని చూసి జోస్ బట్లర్ బిత్తరపోయాడు.
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ బంతి 7.2 డిగ్రీలు టర్న్ అయ్యింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని అంచనా వేయడంలో విఫలమైన బట్లర్ మూల్యం చెల్లించుకున్నాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్లో పిచ్ అయిన బంతి అనూహ్యంగా టర్న్ అయి మిడిల్ స్టంప్ను లేపేసింది. టర్న్ కాదని భ్రమపడిన బట్లర్ బ్యాక్ ఫుట్లో పంచ్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. 2019 వరల్డ్ కప్లో బాబర్ ఆజామ్ను ఇదే తరహా బంతితో బోల్తా కొట్టాడని గుర్తు చేస్తున్నారు. కుల్దీప్ వేసిన ఈ బంతి 'బాల్ ఆఫ్ ది వన్డే ప్రపంచకప్ 2023'అని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యమే అయినా.. డ్యూ రాకపోతే మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. తీవ్ర ఒత్తిడిలో ఉంది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్ ఉన్నారు. మహమ్మద్ షమీ(3/12) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా రెండేసీ వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.