టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ టెస్ట్ అనంతరం కుడి తొడల నొప్పితో జట్టును వీడిన కేఎల్ రాహుల్.. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.
రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్కు ముందే అతను కోలుకున్నా.. పూర్తి ఫిట్నెస్ సాధించలేదని బీసీసీఐ పక్కనపెట్టింది. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని రాంచీ టెస్ట్ బరిలోకి దిగుతాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. రాహుల్ రీఎంట్రీ ఇస్తే రజత్ పటీదార్ బెంచ్కు పరిమితం కానున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

నాలుగో టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతనికి నాలుగో టెస్ట్ నుంచి రెస్ట్ ఇచ్చారు. బుమ్రా దూరమైతే అతని స్థానంలో యువ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే ముఖేష్ కుమార్ టీమిండియాను వదిలి రంజీల్లో సత్తా చాటుతున్నాడు. అతను బ్యాకప్ పేసర్గా జట్టులోకి వస్తాడు.
రాజ్కోట్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్ట్లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో రోహిత్ సేన ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ విధ్వంసకర డబుల్ సెంచరీ బాదాడు. 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 216 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
భారత్ విధించిన 557 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 122 పరుగులకే కుప్పకూలింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజా(5/41) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు కుప్పకూలింది.