
తార స్థాయిలో మాటల యుద్ధం
రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయిలో జరిగింది. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. ఆధిపత్యం చెలాయించేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గి రాజుకుంది.
చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీనిపైనే లోకేష్ రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

కవ్వింపులకు మేమేమీ వెనుకాడం
మ్యాచ్ అనంతరం లోకేష్ రాహుల్ మాట్లాడుతూ... 'రెండు కఠినమైన జట్లు తలపడితే ఇలాగే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య గొప్ప పోరాటాలు దర్శనమిస్తాయి. గొప్ప నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి.
శ్రుతి మించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. మీరు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం' అని అన్నాడు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో శతకం చేసిన రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' పురస్కారం దక్కింది.

ఆనర్ బోర్డునే చూశాను
'ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. తమ సత్తా ఏంటో చూపించాలని అనుకున్నారు. ఈ మ్యాచులో వారి ప్రదర్శన అసమానం. ఎంత పొగిడినా తక్కువే. శతకం కొట్టిన తర్వాత ప్రతి రోజు లార్డ్స్ ఆనర్ బోర్డును చూస్తున్నాను. నా పేరు శాశ్వతంగా ఎప్పుడు చెక్కుతారా అని ఆత్రుత చెందాను. ఇప్పటికైతే అక్కడ తాత్కాలికంగా కాగితంపై అంటించారు. భారత్ విజయానికి నా శతకం ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది' అని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసినా, ఐదు వికెట్లు పడగొట్టినా.. అక్కడి ఆనర్ బోర్డులో వారిని పేరును ఉంచుతారు.

పిచ్ పేసర్లకు అనుకూలించినా
రెండో టెస్ట్ మ్యాచులో టీమిండియాకు పునాది పడిందంటే అది ఓపెనర్ కేఎల్ రాహుల్ (127; 248 బంతుల్లో 12x4, 1x6) సెంచరీ చేయడంతోనే. తొలిరోజు ఉదయం వర్షం పడడంతో పిచ్ పేసర్లకు అనుకూలించింది. అయినా ఇంగ్లండ్ బౌలర్లను రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొదటగా క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్న రాహుల్.. ఆపై గేర్ మార్చాడు. రోహిత్ శర్మ అండతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో గతంలో ఎన్నడో లేని విధంగా భారత ఓపెనర్లు ఇంగ్లీష్ గడ్డపై 100కు పైగా పరుగులు చేశారు. అనంతరం వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేశాడు. దీంతోనే భారత్ 364 పరుగులు చేయగలిగింది.


Click it and Unblock the Notifications

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్!పాకిస్థాన్తోనే భారత్ తొలి మ్యాచ్










