
న్యూఢిల్లీ: గజ్జల్లో గాయం కారణంగా చివరి నిమిషంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న ఐదో టెస్టుకు అతను దూరం కానున్నాడు.
'గజ్జల్లో గాయం నుంచి రాహుల్ కోలుకోలేదు. టెస్టు జట్టు సభ్యులు బుధవారం ఇక్కడ కలుస్తున్నారు. అర్ధరాత్రి ఇంగ్లండ్ బయల్దేరతారు. రాహుల్ జట్టుతో పాటు వెళ్లట్లేదు. కోలుకోవడానికి అతనికి ఇంకా సమయం పడుతుంది.'అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న పంత్ తప్పా.. టెస్టు జట్టు ఆటగాళ్లంతా ఇంగ్లండ్ బయల్దేరుతున్నారు. ఒక్కటే టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున రాహుల్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయడం గురించి సెలక్టర్లు ఆలోచించట్లేదని తెలుస్తోంది.
'ఇప్పటికే శుభ్మన్ గిల్ జట్టులో ఉన్నాడు. ఇప్పటివరకు తాను ఆడిన టెస్టుల్లో అతను ఎక్కువ ఓపెనింగే చేశాడు. ఇద్దరు ఓపెనర్లలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు తలెత్తితే పుజారా కూడా ఓపెనింగ్ చేయగలడు. 17 మంది సభ్యుల జట్టులో 16 మంది ఇంగ్లండ్ వెళ్తున్నారు. కాబట్టి ఓపెనింగ్ పెద్ద సమస్య కాదు'అని ఆ అధికారి వ్యాఖ్యానించాడు. పంత్ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక ఇంగ్లండ్ వెళ్తాడు.
ఇక కేఎల్ రాహుల్ దూరమవడంతో తాత్కలిక సారథిగా భారత జట్టును రిషభ్ పంత్ నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ముగిసిన మూడు టీ20ల్లో పంత్ సేన రెండు ఓడి.. ఒకటి మాత్రమే గెలిచింది. రెండు టీ20ల కోసం ఐర్లాండ్లో పర్యటించే భారత టీ20 జట్టు కెప్టెన్గా హార్దిక్ పాండ్య నియమితుడయ్యాడు. భువనేశ్వర్ వైస్కెప్టెన్.
దక్షిణాఫ్రికాతో సిరీస్లో సారథిగా వ్యవహరించిన పంత్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. కెప్టెన్ రోహిత్, కోహ్లి సహా ఇంగ్లాండ్తో టెస్టులో ఆడే ఆటగాళ్లెవరూ టీ20 జట్టులో లేరు. ఐపీఎల్లో విశేషంగా రాణించిన బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్తో భారత్ టీ20 మ్యాచ్లు ఆడనుంది.