ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ నెట్స్లో గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రసిధ్ కృష్ణ వేసిన బంతి కరుణ్ నాయర్కు బలంగా తాకినట్లు సమాచారం. దీంతో అతని పక్కటెముకలకు గాయమైందని వార్తలు వస్తున్నాయి. ఈ గాయం ధాటికి అతను ఇబ్బంది పడ్డాడని, ఆ తర్వాత మరోసారి బ్యాటింగ్ చేశాడని తెలుస్తోంది. అయితే గాయం తీవ్రత ఎక్కువైతే అతను తొలి టెస్ట్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియాకు కరుణ్ నాయర్ చాలా కీలకం. అతనికి కూడా ఈ సిరీస్ చాలా ముఖ్యం. 8 ఏళ్ల తర్వాత అతను మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మధ్య దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్.. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా పిలుపును అందుకున్నాడు.

కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉండటంతో సెలెక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారు. 2023, 2024 కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లలో నార్తంప్టన్ షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. 10 మ్యాచ్ల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీలో విదర్భ తరఫున 16 ఇన్నింగ్స్ల్లో 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ల్లో 779 పరుగులు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 6 ఇన్నింగ్స్ల్లో 255 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2025 సీజన్లో కూడా అవకాశం అందుకున్న కరుణ్ నాయర్.. మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి సూపర్ జోష్లో ఉన్నాడు. లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. కరుణ్ నాయర్ ఆడటం కీలకం. ఈ క్రమంలోనే అతని గాయం వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.