టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్తో 8 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి బరిలోకి దిగిన కరుణ్ నాయర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఓలి పోప్ కళ్లు చెదిరే క్యాచ్కు పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ డకౌట్ అయినా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 402 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. కరుణ్ నాయర్ 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున చివరి సారిగా ఆడాడు.
ఈ 8 ఏళ్ల కాలంలో కరుణ్ నాయర్ భారత్ తరఫున ఏ ఫార్మాట్ కూడా ఆడలేదు. తన కెరీర్లో భారత్ తరఫున రెండు వన్డేలు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఏడేళ్ల కాలంలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్లు ఆడింది. ఇందులో 77 టెస్ట్లు, 159 వన్డేలు, 166 టీ20లు ఉన్నాయి. దాంతో 402 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఏకైక ప్లేయర్గా కరుణ్ నాయర్ నిలిచాడు. కరుణ్ నాయర్ 8 ఏళ్ల 84 సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్ను అధిగమించాడు. అతను రెండు అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య 396 మ్యాచ్లు మిస్సయ్యాడు. 10 ఏళ్ల 337 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.

| ఆటగాడి పేరు | మిస్సైన మ్యాచ్ల సంఖ్య | మిస్సైన కాలం |
| కరుణ్ నాయర్(భారత్) | 402 | 8 ఏళ్ల 84 రోజులు |
| రయద్ ఎమ్రిట్(వెస్టిండీస్) | 396 | 10 ఏళ్ల 337 రోజులు |
| జో డెన్లీ(ఇంగ్లండ్) | 384 | 8 ఏళ్ల 294 రోజులు |
| మహేళ ఉదవట్టే(శ్రీలంక) | 374 | 8 ఏళ్ల 52 రోజులు |
77 టెస్ట్ మ్యాచ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. జయదేవ్ ఉనాద్కత్ 118 టెస్ట్ మ్యాచ్ల తర్వాత భారత టెస్ట్ టీమ్లోకి రాగా.. 87 మ్యాచ్ల తర్వాత దినేశ్ కార్తీక్, 81 మ్యాచ్ల తర్వాత పార్ధీవ్ పటేల్ పునరాగమనం చేశారు. ఓవరాల్గా కరుణ్ నాయర్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 374 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉండటం గమనార్హం. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ కరుణ్ నాయరే. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. తర్వాతి 7 ఇన్నింగ్స్ల్లో 26 పరుగులకు మించి చేయలేదు.